50 సీట్లపై గురి..! Congress స్కెచ్ ఫలించేనా..?

by Disha Web Desk |
50 సీట్లపై గురి..! Congress స్కెచ్ ఫలించేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్​పార్టీ కసరత్తులు మొదలు పెట్టింది. పార్టీ కేడర్​ఎక్కువగా ఉన్న 50 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది. ఎంపిక చేయబడిన యాబై స్థానాల్లో రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో​ఫోకస్​చేయడం వలన వీటితో పాటు ఆయా నియోజకవర్గాల చుట్టు పక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ ప్రభావం చూపొచ్చని పార్టీ ఆలోచిస్తున్నది. దీని వలన మ్యాజిక్​ఫిగర్‌ను సులువుగా రీచ్​కావొచ్చని కాంగ్రెస్​ధీమాలో ఉన్నది. అందుకు అవసరమైన ప్రణాళికలను పకడ్భందీగా తయారు చేసింది. ప్రధానంగా పార్టీ కేడర్​ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఫోకస్​పెట్టింది. ఉమ్మడి మహబూబ్​నగర్, నల్లగొండ, ఖమ్మంలో పార్టీ పట్టు అధికంగా ఉన్నదని భావించిన నాయకత్వం.. ఆయా జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నీంటిలోనూ గెలవాలని దృష్టిపెట్టింది. దీంతో పాటు మెదక్, నిజామాబాద్‌‌లోని కొన్ని సెగ్మెంట్‌లలోనూ ఎక్కువ సీట్లు గెలవొచ్చని తాము నిర్వహించిన ఇంటర్నల్​సర్వేలో తేలినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా ఈ నియోజకవర్గాలను టచ్​చేస్తూ నిర్వహించే చాన్స్​ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోన్నది. జాతీయ పార్టీ అధిష్టానం నుంచి పర్మిషన్​రాగానే రేవంత్ పాదయాత్ర చేసే అవకాశం ఉన్నదని పార్టీలోని ముఖ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాద యాత్ర ఏర్పాట్లలో పనుల్లో నిమగ్నమైనట్లు గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది.

రెండు సార్లు అధికారం దూరంలో పరేషాన్​

గడిచిన రెండు టర్మ్‌లలోనూ కాంగ్రెస్​అధికారంలోకి రాలేకపోయింది. దీని వలన కాంగ్రెస్​లీడర్లు, కార్యకర్తలు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ చెబుతున్నది. కేసులు, ఇతర ఇష్యూలలో పార్టీ కేడర్​సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీంతో ఈ సారి ఎలాగానే రాష్ట్రంలో కాంగ్రెస్​ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లనున్నారు. అసంతృప్తులను సముదాయిస్తూ అధికారమే లక్ష్యం అనే నినాదంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్​ప్రణాళికలు రెడీ చేసింది. దీనిలో భాగంగా గత కొద్ది కాలంగా దూరంగా ఉన్న ఎంపీ కొమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ కూల్​చేశారు. వెంకట్​ రెడ్డి గాంధీ భవన్​మెట్లు ఎక్కగానే నల్లగొండ జిల్లాలోని కేడర్‌లో కొత్త జోష్​ వచ్చినట్లు పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. ఇక గత కొద్ది కాలంలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సీనియర్లు వర్సెస్​జూనియర్ల వివాదంతో పార్టీకి దూరంగా ఉన్న ముఖ్య లీడర్లను కూడా టీపీసీసీ కమిటీలు బుజ్జగించనున్నాయి. ఇక ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే మూడు రోజుల పాటు కాంగ్రెస్, దాని అనుబంధ కమిటీలతో భేటీ కానున్నారు. పార్టీ కోసం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదంటూ మరోసారి సూచించనున్నారు.

కాంగ్రెస్​పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ విధానాలతో విసిగిపోయిన లీడర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్​నాయకత్వం రెడీ అయింది. ముఖ్యమైన లీడర్లకు గాలం వేసే పనిలో ఉన్నది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలో ప్రభావం చూపగలితే నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చలు చేయాలని ఆలోచిస్తున్నారు. సీఎల్పీ నేత ప్రెస్​మీట్​ సమక్షంలోనే పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మిగతా జిల్లాల్లోనూ కీలక నేతల జాబితాను గాంధీభవన్​వర్గాలు తయారు చేస్తున్నాయి. రేవంత్ పాదయాత్ర, హాత్ సే హాత్​ జోడో కార్యక్రమంలో ఆ లీడర్లతో చర్చలు జరపాలని పార్టీ భావిస్తున్నది. అయితే కాంగ్రెస్​పార్టీ కొత్త స్కేచ్​ ఏ విధంగా ఫలితం ఇస్తుందనేది త్వరలో తేలనున్నది.

Also Read...

తెలంగాణలో 'గుజరాత్ మోడల్' మంత్రం



Next Story

Most Viewed